భూసేకరణ నోటిఫికేషన్ జారీ
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జిల్లాలో ప్రధాన రహదారిగా ఉన్న అమలాపురం – రావులపాలెం (NH 216E) విస్తరణ పనుల కోసం తాజాగా భూసేకరణ నోటిఫికేషన్ను జారీ చేసింది.విస్తరణ వివరాలు:
ఈ ప్రాజెక్టులో భాగంగా అమలాపురం నుంచి రావులపాలెం వరకు కి.మీ 0.000 నుండి కి.మీ 31.600 వరకు రహదారిని అభివృద్ధి చేయనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ రహదారిని 2 లేన్ల పేవ్డ్ షోల్డర్స్తో లేదా 4 లేన్లుగా విస్తరించడంతో పాటు, భవిష్యత్ నిర్వహణకు అవసరమైన భూమిని సేకరించనున్నారు.
అభ్యంతరాలకు గడువు:
ఈ భూసేకరణ నోటిఫికేషన్పై అభ్యంతరాలు ఉన్న భూయజమానులు లేదా ఇతర ఆసక్తి గల వ్యక్తులు, గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ (డిసెంబర్ 31, 2025) నుండి 21 రోజులలోపు తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ఎవరిని సంప్రదించాలి?
అభ్యంతరాలు ఉన్నవారు తమ అభ్యర్థనలను లిఖితపూర్వకంగా, తగిన ఆధారాలతో సహా
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ (కాంపిటెంట్ అథారిటీ) వారికి సమర్పించాలని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ హైవే విస్తరణతో కోనసీమ జిల్లాలో రవాణా మరింత సాఫీగా మారి, వాణిజ్య, వ్యవసాయ కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
